24, డిసెంబర్ 2012, సోమవారం

తెలుగునెక్కడ బతకనిచ్చారు?



తెలుగునెక్కడ బతకనిచ్చారు?
          17-9-2004 న తమిళాన్ని ప్రాచీన భాగా గుర్తించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించినపుడే మనవాళ్లు తమిళ నాయకుల్ని చూసైనా నేర్చుకోవాలని మన తెలుగు పెద్దలు సుద్దులు చెప్పారు. వెయ్యేళ్లనాటి రాత సాహిత్యం మనకీ ఉందిలే అనే తెలుగువాళ్ళ ధీమాను దెబ్బతీస్తూ 1500 ఏళ్ల లిఖిత సాహిత్యం ఉండాలని కాలవ్యవధిని పెంచేశారు. అంటే తమిళానికున్న స్థానం ఇక ఏ భాషకూ దక్కకుండా ఏర్పాట్లు చేశారు. భాషలను విభజించి పాలిస్తున్నారు. ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు తెలుగును ప్రాచీన భాషగా గుర్తించాలని కేంద్రాన్ని కోరారు. తెలుగును ప్రాచీన భాషగా గుర్తించనందుకు నిరసనగా వేటూరి సుందరరామ్మూర్తి గారు తన పాకిచ్చిన జాతీయ అవార్డును వాపసు చేశారు. తెలుగు ప్రాచీనతకు ఆధారాల సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని నియమించింది. ఇప్పుడు ఎవరి భాషల మూలాలు వాళ్ళు వెతుక్కుంటున్నారు. భాషల పోటీ మొదలయ్యింది.
      
              నన్నయ్యగారిని ఆదికవి అన్నారు కాబట్టి ఆయన కాలం నాటికి,   అంటే        వెయ్యేళ్ళ పరిమితికే ప్రాచీనతా నిర్ధారణా ప్రమాణాన్ని కుదించాలని   మన పెద్దలు ప్రయత్నిస్తున్నారు. మధ్య దలైలామా కాలచక్ర తంత్రం     జరిపిన      అమరావతికి 2500 సంవత్సరాలనాడే గౌతబుద్ధుడు    వచ్చాడు గదా !    అప్పుడిక్కడ తెలుగు లేదా ? మాటలు అక్షరాలుగా మారి సాహిత్యరూపం    పొంటానికి లక్షల ఏళ్ళు పట్టవచ్చు. నిరంతరం        యుద్ధాల్లో మునిగి తేలే ప్రాంతాల్లో భాష ఉంటుంది గానీ, వ్రాసిన     సాహిత్యానికి భద్రత        ఉండకపోవచ్చు. ఏ జాతి ప్రజలకు అన్ని రంగాల్లో భద్రత ఉంటుందో, ఆ జాతి      ప్రజా భాషకూ భద్రత ఉంటుంది.      మనుషులుంటేనే గదా భాష బతికేది ?

              అలాగే ఒక జాతి ప్రజల భాష నిరాదరణకు గురైతే ఆ జాతి కూడా     క్రమేణా        నీరసించిపోతుంది. లిపులున్న భాషలకే అతీగతీ లేకపోతుంటే,        లిపులులేని        ఎన్నో విలువైన భాషలు తమ ప్రాచీనతను ఎలా    తెలియజేసుకుంటాయి ?

       అయినా ప్రాచీన భాషలకు మాత్రమే కోట్లాది రూపాయలను కుమ్మరించాలనే       అసహజ భావన ఎలా కలిగింది ? ఒక కుటుంబంలోని బిడ్డల్లో ఎవరైనా   పేదరికంలో వుంటే మిగతా కుటుంబ సభ్యులు ఆ పేదవాడికి సాయం   చేస్తారు. బైబిల్ లో ఏసుక్రీస్తు ఉన్నవాడికే ఇంకా ఇవ్వబడుతుంది. లేని    వాడి దగ్గరనుండి వాడికున్నది కూడా తీసివేయబడుతుంది అంటారు.        ప్రస్తుతం కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న విధానం అలాగే ఉంది.

              అంతర్జాతీయ భాష పేరుతో ఇంగ్లీషు, జాతీయ భాష పేరుతో హిందీ,   అమరభాష పేరుతో సంస్కృతం, ప్రాచీన భాష పేరుతో తమిళం కోట్లాది       రూపాయల ప్రజాధనాన్ని పంచుకుంటున్నాయి. మనల్ని అడగకుండానే,     మన అనుమతి లేకుండానే ఈ పంపకం జరిగిపోయింది. పంట వాళ్ళు   పట్టుకెళ్లి పరిగె మనకొదిలారు.

       బోర్డుల మీద రాసిన హిందీ పేర్లు తుడిపేస్తు, Long live Classical Divine     Tamil అనే భాషాభక్తిని తమిళులు ప్రదర్శిస్తూ వారి భాషను సంస్కృతం    హిందీ భాషల బారినుండి రక్షించుకుంటుంటే, తెలుగువాళ్లు తెలుగునే చీదరించుకుంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. ఒక జాతి సమస్త వ్యవహారాలు     దాని భాషలో సాగితేనే గదా ఆ జాతికో భాష స్థిరపడేది, బలపడేది ? ఇక్కడ      తెలుగు భాషను చంపేస్తు కేంద్రాన్ని ఏమి అడిగినా పెద్దగా ప్రయోజనం      ఉండదు. గొప్పల కోసం బడాయి కోసం సంస్కృతం, హిందీ ఇంగ్లీషుల్ని   నేర్చుకున్నారు గానీ, తెలుగునెక్కడ బతకనిచ్చారు ?

       భాషోద్యమం దారి తప్పిందనే వ్యాసంలో రంగనాయకమ్మ ఇలా అన్నారు :

       మనుషులు ఎంత ప్రాచీనమో భాషలు అంత ప్రాచీనం. అనేక తె మనుషులు ఈనాటికీ రాళ్ళల్లోనూ రప్పల్లోనూ అడవుల్లోనూ కొండల్లోనూ      పడి ఏడుస్తుంటే వాళ్ళకు లిఖిత సాహిత్యం ఎలా వస్తుంది ? వాళ్ళ భాషలకు లిపి లేకపోతే అది వాళ్ళ తప్పా ? లిపి కూడా లేని భాల్ని     పట్టించుకోకుండా అభివృద్ధి చెందిన భాషలకోసమే డబ్బు గుప్పించడం        ఎందుకు?” (ఈనాడు 9-2-2006)
    హిందీ కోసం ఏం చేశారో చూడండి ?
1949 భారతదేశానికి హిందీ అధికార భాషగా ఉండాలని రాజ్యాంగ సభ తీర్మానించింది.
1952 హిందీ స్వచ్ఛంద శిక్షణను విద్యాశాఖ చేపట్టింది. గవర్నర్లు, హైకోర్టు, సుప్రీం కోర్టు హిందీ వాడొచ్చని ఆదేశాలిచ్చారు.
1955 అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖల్లో హిందీ బోధనా కార్యక్రమం మొదలుపెట్టారు. ఖేర్ కమీషన్ వేశారు. దేశమంతా హిందీ వాడాలని ఆదేశించారు. (ఆర్టికల్ 343(2))
1960 హిందీ టైపింగు, స్టెనోగ్రఫీ నిర్భంధం చేశారు. హిందీ శబ్దకోశాలు, చట్టాల
       తర్జుమా జరగాలని రాష్ట్రపతి ఉత్తర్వులిచ్చారు.
1963  హిందీ జాతీయ అధికా భాషా చట్టం తెచ్చారు.
1967  ప్రధా మంత్రి అధ్యక్షతన కేంద్రీయ హిందీ సమితి ఏర్పాటు చేశారు. త్రి భాషా సూత్రం తెచ్చారు.
1971   కేంద్రీయ అనువాద బోర్డు నెలకొల్పారు.
1975  అధికార భాష డిపార్ట్ మెంట్ స్థాపించారు.
1977 అప్పటి విదేశాంగ మంత్రి అటల్ బిహారీ వాజ్ పేయ్ ఐక్యరాజ్య సమితిలో హిందీలో మాట్లాడారు.
1981   సెంట్రల్ సెక్రటేరియట్ లో అధికారభాష సర్వీస్ ప్రారంభించారు.
1983  యంత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలలో హిందీ వాడకం పెంచటం కోసం అధికార భాషా శాఖలో టెక్నికల్ సెల్ ఏర్పాటు చేశారు.
1985  ఉద్యోగులకు హిందీ టైపింగ్, షార్ట్ హ్యాండ్ నేర్పటానికి సెంట్రల్ హిందీ టైనింగ్ ఇన్ స్టిట్యూట్ స్థాపించారు.
1986  ఇందిరాగాంధీ రాజభాషా అవార్డులు మొదలుపెటారు.
1988  అప్పటి విదేశాంగ మంత్రి శ్రీ పి. వి. నరసింహారావు ఐక్యరాజ్య సమితిలో హిందీలో మాట్లాడారు.
1999  హిందీ అధికారభాష గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు జరిపారు.
2000 హిందీలో ఇ-మెయిల్, చాటింగ్ సదుపాయాలతో అధికార భాషా డిపార్ట్ మెంట్ పోర్టల్ తెరిచింది. గ్యాన్ – విగ్యాన్ జాతీయ అవార్డులు ఇవ్వటం మొదలుపెట్టారు.
2003 ఎన్.డి.ఎ, సి.డి. యస్. పరీక్షా పత్రాలు హిందీలో ఉండాలని కేబినెట్ నిర్ణయించింది. హిందీ ప్రభోధ్, హిందీ ప్రవీణ్, హిందీ ప్రగ్య, సెల్ఫ్ లెర్నింగ్ కంప్యూటర్ ప్రోగ్రాములు అధికార భాష డిపార్ట్ మెంట్ వెబ్ సైట్లో చేర్చారు. తెలుగు తదితర భాషల వాళ్ళు ఉచితంగా హిందీ నేర్చుకోవచ్చు.
2004 అధికార భాషా చట్టం అమలు చేసే హిందీ అధికారుల సంఖ్య పెంచారు. ఎన్ సి ఇ ఆర్ టి లాంటి సంస్థలన్నీ వాటి పుస్తకాలలో వాడే సాంకేతిక పదాలను సూచించటానికి శాస్త్రసాంకేతిక హిందీ పదాల కమీషన్ ను నెలకొల్పారు.
2005 525 హిందీ ఫాంట్లు, ఫాంట్ కోడ్ కన్ వర్టర్లు, డిక్షనరీలు ఉచితంగా ప్రజలకు పంచారు. గ్యాన్ –విగ్యాన్ బహుమతుల మొత్తాన్ని పెంచి రాజీవ్ గాంధీ జాతీయ అవార్డులుగా పేరు మార్చారు.
      
              ఇలాంటి పనులన్నీ తెలుగు కోసం చెయ్యాలి. నిజామాబాద్ కలెక్టర్ రాయుడు తెలుగులో నివేదికలు పంపని అధికారులందరికీ మెమోలు జారీ చేశాడ. ఇలా మన పరిధిలోనే కొంతపని జరగాలి. క్రమశిక్షణ రావాలి. తెలుగు బిడ్డవయుండి, తెలుగు మాట్లాడేందుకు సంకోచపడేవు సంగతేమిటిరా ?” అనే కాళోజీ వేసిన సూటిప్రశ్న మనం వేసుకోవాలి. తెలుగు భాషోద్యమ నాయకులు కొందరు పరస్పరం ఇంగ్లీషులో తిట్టుకుంటున్నారు. ఇక్కడా కులాల వారీ గొడవపడుతున్నారు. కులాల వారీగా చీలి తెలుగు భాష ఎలా ఉండాలో నిర్దేశించుకుంటున్నారు.
తమిళం కోసం ఏం చేశారు ?
మైసూరులోని సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజస్
క్లాసికల్ తమిళ్కోసం ఇస్తున్న అవార్డులు ఇవి :

1.    చెమ్మోజి చెమ్మల్ అవార్డులు – 3 (ఒక్కొక్కటి లక్ష రూపాయలు) 1-విదేశీయులకు, 1-ప్రవాస భారతీయులకు, 1-దేశీయులకు.

2.    చెమ్మోజి చెల్వర్ అవార్డులు -5 (ఒక్కొక్కటి 50 వేల రూపాయలు) (30-40 ఏళ్ల వయస్సులోని పండితులకు).

3.    డాక్టరల్ ఫెలోషిప్పులు -10 (నెలకు 10 వేల రూపాయల చొప్పున అయిదేళ్ళ పాటు) అదనంగా ఏడాదికి పదివేల మొత్తం.

4.    పోస్ట్  డాక్టరల్ ఫెలోషిప్పులు -5 (నెలకు 12 వేల రూపాయల చొప్పున మూడేళ్లు, అదనంగా ఏడాదికి రూ|| 20,500).

ఈ మాత్రం తెలుగుకు కూడా ఇవ్వవచ్చు గదా ? 12-10-2004 తమిళాన్ని ప్రాచీన భాషగా గుర్తించింది మొదలు చక చకా ఈ పనులన్నీ జరిగిపోయాయి.

సంస్కృతం వేదభాష కాబట్టి ఆ భాష మాట్లాడేవాళ్లు ఇప్పుడెవరూ లేకపోయినా మతాచారాల కోసమే బ్రతికించుకుంటూ వస్తున్నారు. ప్రాంతీయ భాషల్లో పదాలు పుష్కలంగా ఉన్నా వాటిని కాదని సంస్కృత పదాలను పసిపిల్ల మీద రుద్దుతూ చదివిస్తున్నారు. ఉదాహరణకు కూడికను సంకలనం అనటం, తీసివేతను వ్యవకలనం అనటం. ఎవరికీ తల్లిభాష కాని  భాషకు పట్టం కట్టి, మాతృభాషలోని చేవను జావకార్చి ప్రజల భాషను ప్రజల దగ్గరకు తీసుకుపోవడానికి పడుతున్న ఈనాటి పాట్లకు ఈ పండితులే కారకులని అధికార భాషా సంఘం అధ్యక్షులు ఎ.బి.కె. ప్రసాద్ వాపోయారు. ప్రాచీన సారస్వతంలో పండితులు జానపదుల ఉనికిని, వారి పద సాహిత్యాన్నీ, వారి పాటలనూ విస్మరించి తెలుగువారి చరిత్రకు అన్యాయం చేశారని బాధపడ్డారు. ఆంధ్రదేశంలో పనిగట్టుకొని బౌద్ధధర్మాన్ని నిర్మూలించారనీ, ఆంధ్రుల చారిత్రక ఆధారాలను అదృశ్యం చేశారనీ, కులవ్యవస్థతో బౌద్ధధర్మాన్ని భారతదేశ సరిహద్దులు దాటించడమేగాక, తెలుగు భాషకూ చీపట్టించారని, తెలుగులో జైన బౌద్ధమతాలు సృష్టించిన సాహిత్యాలను నామ రూపాలు లేకుండా చేశారనీ విమర్శించారు. (వార్త 9-2-2006).

అణచివేతే అసలు కారణం అనే వ్యాసంలో కత్తి పద్మారావు ఇలా అన్నారు. ఆంధ్రులు బౌద్ధాన్ని ఆదరించడం వల్ల వైదిక గ్రంధాలు వీరిని నిందిస్తూ వచ్చాయి. ఎంతో ప్రాచీనమైన తెలుగు మౌఖిక రూపం నుండి లిఖిత రూపానికి రాకపోవటానికి కారణం అది రాజభాష కాకపోవటమే. ఆంధ్రదేశంలో క్రీ.పూ 300 నుండి క్రీ. శ. 300 వరకు ప్రాకృతం, క్రీ.శ. 300 నుండి 600 వరకు సంస్కృతం రాజభాషగా పెత్తనం చేశాయి. తెలుగు సాహిత్యం మొదట బౌద్ధంలో ఆవిర్భవించింది. 1700 సంవత్సరాల పాటు మాట్లాడుతూ ఏ జాతి అయినా సాహిత్యం లేకుండా ఉంటుందా ? రాజకీయ, అణచివేల్లోనే తెలుగు తన సాహిత్యాన్ని కోల్పోయింది. లిఖితంలో ఉన్నా లేకపోయినా భాష భాషే. కులమత భేదాలు పాటించకుండా మనం అందరం ఒక భాషాజాతిగా పోరాడాలి. (ఆంధ్ర జ్యోతి 8-2-2006)

ప్రపంచంలో మనుషుల్ని భాషే ఒక జాతిగా కలుపుతుంది. ఎందుకంటే ఆ జాతి వ్యవహారాలు ఆ జాతి భాషలోనే నడుస్తాయి కాబట్టి, కానీ తెలుగు జాతికి సమాచార సాధనంగా, విజ్ఞాన ప్రదాయినిగా ఉండాల్సిన తెలుగు భాష – మనల్ని అందరినీ ఒకే బాట మీదకు, ఒకే మాట మీదకు తేలేని దీన పరిస్థితికి అణగదొక్కారు. ముఖ్యంగా మన పద సంపదను ఎందుకూ పనికిరాని దానిలా తీసిపారేశారు. మన జనం మాట్లాడేదే నిజమైన తెలుగు. అది గ్రంధాల్లోకి రాలేదు. ఈ గ్రంధాల్లోకి రాని తెలుగును వేల ఏళ్ల నుండి మన ప్రజలు మాట్లాడుతూనే ఉన్నారు. ప్రజల నోళ్లలోని తెలుగు పదాలు ఈనాటికీ నిఘంటువుల్లోకీ, గ్రంధాల్లోకి ఎక్కకుండా అడ్డుపడుతున్నవాళ్లు లేరా? Penis, vegina లాంటి పదాలకు సంస్కృత పదాలను కాకుండా మన జనం పలికే తెలుగు పదాలనే యథాతధంగా ఇప్పటికైనా గ్రంధాల్లోకి ఎక్కించగలరా ? ఎందుకో నాకే భయంగా ఉంది. అంటే నా భాషను నేనే పలకలేకపోతున్నాను. నా భాషను నేనే రాయలేకపోతున్నాను. ఎందుకీ అపరాధ భావన నాకు కలుగుతోంది ? ఇంతకంటే పచ్చి బూతు మాటల్ని సంస్కృతంలో, ఇంగ్లీషులో నిర్భయంగా మాట్లాడుతున్నారు, రాస్తున్నారే! ఏమిటీ సంకెళ్ళ పరిస్థితి ? ఆనాడెప్పుడో అణచివేశారు కాబట్టి అలా జరిగిందన్నారు. ఇప్పుడు కూడా మన పదాలను మనమే చీదరించుకుంటున్నామే? ఇక ప్రాచీన తెలుగు పదాలను తవ్వి తలకెత్తుకోగలమా ? ఆ ధైర్యం మనకులేదు. అవతలి వాళ్లేమనుకుంటారోనని తన మాటల్ని తన గొంతులోనే దిగమింగే మానసిక రుగ్మత తెలుగుజాతిని తరతరాలుగా పీడిస్తోంది. దీనికి చికిత్స జరగాలి.

తెలుగుకు ప్రాచీన భాష హోదా కల్పించాలని త్వరలో అసెంబ్లీలో తీర్మానం కూడా చేస్తారని పెద్దలు చెబుతున్నారు. ప్రాచీన భాషగా తెలుగు గుర్తించబడితే వందకోట్ల రూపాయల దాకా నిధులు వస్తాయి. అయితే ఆ డబ్బుతో ప్రాచీన సాహిత్యాన్ని ప్రచురించి ప్రచారం చెయ్యాలేగాని నేటి మన భాషావసరాలకు వాడకూడదట. ఇందువలన తెలుగు  జాతి ప్రజలందరికీ, అనుదిన జీవితంలో మనం వాడే వాడుక భాషకు జరిగే మేలేమీ ఉండదు. ఆ ప్రాచీన భాషను మన ఆఫీసుల్లో వాడకంలోకి తేగలమా? ఆ డబ్బంతా ప్రాచీన సాహితీవేత్తల పీఠాలకే ఖర్చవుతుంది తప్ప చదివే వాళ్లెవరూ ఉండరు. ప్రజలు ఆదరిస్తేనే గదా భాషకైనా మనుగడ ఉండేది ? ప్రజలు ఆ భాషను ఆదరించాలంటే ఆ భాషలో చదువులు, ఉద్యోగాలు ఉండాలి. ఆ భాషను ఆధునిక అవసరాలకూ ఉపయోగపడేలా అభివృద్ధి చేయాలి. లిపిని కూడా యంత్రాలకు అనుకూలంగా సంస్కరించుకోలేని వాళ్ళం మనం, ఇండియాలో కొన్ని వందల ఏళ్ల క్రితం మాత్రమే పుట్టిన ఉర్దూ భాషలో నిజాం రాజులు వకీలు, వైద్యవిద్యల్ని కూడా అభివృద్ధి పరుచుకోలేదా? ఆ భాషలో ఉన్నత చదువులు మన కళ్ల ముందే దశాబ్దాల్లోనే అంతరించిపోవటం మనం చూడలేదా?

ఆదికవితో ఆగిపోవటం తప్పు. ఆదికవి అని ఒక వ్యక్తికి పేరు పెట్టేముందు ఆ కవికి ముందు ఎలాంటి సాహిత్యంగానీ కవులుగానీ లేకుండానే ఆయన స్వయంభువులాగా వెలిశాడా అని ఆలోచించి ఉండాల్సింది. ఆదికవికి అవతల తెలుగే లేదా? తెలుగు పల్లె పదాలను, తెలుగు పల్లె కవుల్నీ తిరస్కరించి ఘంటాలు పట్టి ఆకుల మీద సంస్కృతం రాసిన పండితుల్ని మాత్రమే గుర్తించిన దాని ఫలితమే ఇది. ఇప్పటికైనా ప్రజల వాడుకలోని తెలుగుకు పట్టంగట్టి, పల్లెభాష ప్రాచీనతను చరిత్రకారులు వెతకాలి. అది బుడబుక్కల వారి తెలుగు కావచ్చు. కాటిపాపల వారి తెలుగు కావచ్చు. అదే అసలైన తెలుగు. ప్రాచీన కాలం నుండి సంస్కృత పండితుల ఛీత్కారానికి, రాజ్యాధికారుల హేళనకు గురైన తెలుగు, బడుగువర్గాల వారి బాసే అసలైన తెలుగు. ఇప్పటికీ చూడండి – తెలంగాణా వాళ్ళు మాట్లాడే భాషను ఎగతాళి చేస్తున్నాను. వాళ్ళది తెలుగు కాదా ? మాండలికాల పట్ల, వృత్తికులాల వారి తెలుగు భాష పట్ల ఇంత వివక్షను నేటికీ ప్రదర్శిస్తూ తెలుగు జాతిని ఇంకెప్పుడు ఏకం కానిస్తారు ? ప్రాచీనత వల్ల ఒరిగేదేం లేదు. అన్నీ కులాల్లో, అన్నీ ప్రాంతాల్లో వాడుకలో ఉన్న నేటి తెలుగుకు  అభివృద్దికి నిధులు కావాలి !
          (గీటురాయి వారపత్రిక : 24-2-2006)