5, జూన్ 2017, సోమవారం

పాలనా భాషగా తెలుగు అమలులో ఎదురయ్యే సమస్యలు –పరిష్కారాలు







పాలనా భాషగా తెలుగు అమలులో ఎదురయ్యే సమస్యలు –పరిష్కారాలు

భాషల ప్రాతిపదికపై ఏర్పడిన మొదటి రాష్ట్రం అంధ్రప్రదేశ్. తమిళభాష ఆధిపత్యాన్ని వదిలించుకొని మన తెలుగు భాషలో మనల్ని మనమే పరిపాలించు కుందామనే సదాశయంతో ఆనాడు ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు.ఇప్పుడు తెలంగాణా,ఆంధ్రప్రదేశ్ రెండూ తెలుగు రాష్ట్రాలే.ఉమ్మడి రాష్ట్రంలోని భాషా పరమైన కోరికలే ఇప్పటికీ తెలుగు ప్రజలలోఉన్నాయి,ఎప్పటికీ ఉంటాయి. అవి తీరేదాకా ప్రజలు అడుగుతూనే ఉంటారు.ప్రజల భాషలో పరిపాలన జరగాలనే కోరిక అతి సహజమైనది.
ఇప్పటి వరకు వచ్చిన జీవోలు :


జిల్లా స్థాయి కోర్టుల్లో దిగువ స్థాయి న్యాయస్థానాల్లో వాదప్రతివాదాలు తెలుగులో జరగాలి.తీర్పులన్నీ తెలుగులోనే ఇవ్వాలి అనేదే 1974లో వచ్చిన  మొదటి జీవో (ప్రభుత్వ ఉత్తర్వు (హోంశాఖ) సంఖ్య 485 తేదీ.29.3.1974).
ఆతరువాత తెలుగులో  పాలన సాగించటం కోసం  1988 నుండి ఇప్పటి వరకు 5 ముఖ్యమైన ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చాయి. వాటి  ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో అధికార భాషగా తెలుగును ఖచ్చితంగా అమలు చెయ్యాలి.జీవోలిచ్చారు గానీ ఆ ఉత్తర్వులు ఎన్నడూ సరిగా అమలుకాలేదు.
అవేమిటో చూద్దాం:
 1. ఆంగ్లంలో వచ్చిన ఏ ఉత్తరం పైనా ,ప్రతిపాదనపైనా ఎలాంటి చర్య తీసుకోకుండా తిప్పి పంపే అధికారం ప్రతి గజిటెడ్ అధికారికీ ఉంది.తమకంటే పై అధికారుల కార్యాలయాలనుండి వచ్చినా సరే ఆంగ్లంలో వచ్చిన లేఖలను తిప్పి పంపవచ్చు.ఈ విధంగా చేయడం వల్ల జరిగే కష్ట నష్టాలకు,జాప్యానికీ వాటిని ఆంగ్లంలో పంపిన అధికారులదీ ,కార్యాలయాలదే బాధ్యత. (ప్రభుత్వ ఉత్తర్వు (సాధారణ పరిపాలన అ.భా శాఖ) సంఖ్య 167తేదీ.19.3.1988)
2.  1988 నవంబరు 1 వ తేదీ నుండి రాష్ట్రంలో ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ తెలుగులోనే జరగాలి.అన్ని ప్రభుత్వ ఉత్తర్వుల జారీకి తెలుగు భాషనే ఉపయోగించాలి.ఆంగ్లం వాడకూడదు.కేంద్ర ప్రభుత్వం,ఇతర రాష్ట్రాలు,రాష్ట్రం వెలుపల ఉన్న చిరునామాదారులతో మాత్రమే ఆంగ్లం ఉపయోగించాలి.(ప్రభుత్వ ఉత్తర్వు (సాధారణపరిపాలనఅ.భాశాఖ)సంఖ్య587తేదీ.28.10.1988)
3. అన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు ,రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో ఉన్న అన్ని సంస్థలు,అన్ని స్థానిక సంస్థలు తెలుగులోనే ఉత్తర ప్రత్యుత్తరాలు జరపాలి.అన్ని శాసనేతర అవసరాలకు ప్రజలతో జరిపే ఉత్తర ప్రత్యుత్తరాలకూ తెలుగు భాషనే ఉపయోగించాలి. (. ప్రభుత్వ ఉత్తర్వు (సాధారణ పరిపాలన అ.భా శాఖ) సంఖ్య218తేదీ.22.31990)
4. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే ఉత్తర్వులు,నియమాలు,నిబంధనలు,ఉపవిధులు అన్నీ కూడా తెలుగు భాష లోనే ఉండాలి. (ప్రభుత్వ ఉత్తర్వు( సాధారణ పరిపాలన అ.భా శాఖ) సంఖ్య 420 తేదీ .13.9.2005 )
5.రాష్ట్రంలోని అన్ని దుకాణాలు ,సముదాయాల బోర్డులు ప్రభుత్వ పధకాల ప్రారంబోత్సవ నామఫలకాలు,శంకుస్థాపన శిలాఫలకాలు తెలుగులోనే రాయించాలి.( ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 11 (యువజన & సాంస్కృతిక అధికార భాష శాఖ) తేదీ.14.9.2016)
పై ఉత్తర్వులన్నీ ఖచ్చితంగా అమలుచేస్తే పరిపాలన పూర్తిగా తెలుగులోనే జరుగుతుంది.జరిగి తీరాలి.
మరి తెలుగు పరిస్థితి ఎందుకు ఇలా దిగజారింది ?
తెలుగువాడిగా పుట్టటం ఎన్నోజన్మల పుణ్యఫలం అనీ,రాయల కాలంనాటి రాజభాష అనీ గొప్పలు చెప్పుకోవటమే గానీ క్రమంగా తెలుగు భాష పాలనకు దూరమై కవులకూ కవిత్వాలకు మాత్రమే పరిమితమై పోయింది.తెలుగులో చదువుకొనే పిల్లలు తగ్గిపోయారు.తెలుగు బడులు మన కళ్ళముందే ఇంగ్లీష్ కాన్వెంట్లు గా మారిపోయాయి.తెలుగులో చదివితే ఉద్యోగాలు రావు అనే అభిప్రాయానికి ప్రజలు వచ్చేలా చేసారు.ప్రాధమిక పాఠశాలలు కూడా ఇంగ్లీషువే కావాలని పట్టుబడుతున్నారు.ఎందుకంటే తెలుగు మాత్రమే చదివితే ఉద్యోగాలు రాని పరిస్థితి ఉంది.తెలుగు భాష ద్వారా కూడా ఉద్యోగాలూ,డబ్బు వస్తుంటే అప్పుడు కొందరైనా స్వార్ధం కొంత చంపుకొని తెలుగు చదువుతారు.తెలుగు భాషను బయటి వాడు ఎలాగూ ఆదరించడు ఇంట్లోని వాడూ ఆదరించటం లేదు.ఇలాంటి పరిస్థితుల్లో తెలుగులో పరిపాలన కోరుతున్న మనల్ని కొందరు విచిత్రంగా చూస్తారు.ప్రజల భాష పాలనా భాష గా మారకపోతే ఆ భాష చచ్చిపోతుంది.తెలుగు భాషను ఇళ్ళల్లో మాట్లాడుకోవటానికి పరిమితం చేసి ఆఫీసుల్లో మాత్రం ఆంగ్లానికి పట్టం కడుతున్నారు.తెలుగు ప్రజలు ఇంట్లో తెలుగు మాట్లాడుకున్నా , ఆఫీసులో ఇంగ్లీషు, కోర్టులో ఇంగ్లీషు, కొన్ని ప్రాంతాల్లో హిందీ లేదా ఉర్దూ మాట్టాడాల్సి వస్తుంది. చివరికి దేవుడి ప్రార్ధన చేసుకుందామన్నా సంస్కృతంలోనో అరబ్బీలోనో చేసుకోవాల్సి వస్తోంది. తెలుగు మనిషి మనసుతో పనిలేని ఓ యంత్రం లాగా మారాడు. అలా కాకుండా  ఆఫీసుల్లో కూడా మన మనసే (మాత్రుభాష) రాజ్యమేలాలి అంటే ఆ భాష బాగా నేర్చిన వారిని మాత్రమే అధికారులుగా రానివ్వాలి.పాలకులకు ఆచరణలో కొన్ని  భాషాపర మైన అవసరాలు,సమస్యలు  పదేపదే ఎదురౌతాయి.అందువలన మన భాషలో పరిపాలన బాగా జరగటానికి ఇంకా ఏమేమి  సమస్యలు ఎదురౌతాయో వాటిని అధిగమించి ఎలా పనులు చెయ్యాలో చూద్దాం:
 
1. న్యాయపాలన తెలుగులోకి మారాలి     
పూర్వకాలంలో మన దేశంలోని రాజులు చక్రవర్తులు తమ తమ మాతృ భాషలలో ప్రజలతో సంభాషించేవారు. అలాగే ధైనందిన జీవిత వ్యవహారాల పరిష్కారాల విషయంలో కూడా మాతృభాషని ఉపయోగించటం వలన ప్రజలకు రాజ్యపాలన దగ్గరైంది. ప్రజల భాషలోనే రాజ్యపాలన సాగింది. ఎవరైనా బాధితుడు వచ్చి ధర్మగంటను మ్రోగిస్తే, రాజు విచ్చేసి బాధితుడి మొర విని నిందితుడ్ని పిలిపించి అందరి సమక్షంలో విచారించేవాడు. అ విచారణలో ఇరు పక్షాల వాదోపవాదాలు మాతృ భాషలో జరిగేవి. తీర్పరి అయిన రాజుగారికి ఫిర్యాది-నిందితుడికీ మధ్య మధ్యవర్తిగా ఏ' ప్లీడరు' వుండేవాడు కాదు.
రాజు విచారణ జరిపేటపుడు ప్రజల భాషలోనే ప్రశ్నించి వివాద మర్మాన్ని పసిగట్టేవాడు. చివరకు ప్రజల భాషలోనే తీర్పు ప్రకటించే వాడు. ఈ మేరకు ఆటు విచారణ ఇటు తీర్పు ప్రజల సొంత భాషల్లో జరగటంతో మధ్యవర్తుల ఆవసరమే వుండేది కాదు. తీర్పు సొంతభాషలో రావడంతో ఫిర్యాదికిగానీ,  నిందితుడికిగాని అర్ధంకానిదంటూ ఏవిూ వుండేది కాదు. ప్రస్తుత న్యాయపరిపాలన విధానంతో అనాటి పద్థతులను పోల్చి చూసుకుంటే ఎంతో క్షోభ కల్గుతుంది.ఈనాటికైనా పరిపాలనా విధానాలన్నీ ప్రజల భాషలోనే జరిగితే అనాటి ఆనంద కరమైన  పరిస్థితులు  తిరిగి  వస్తాయి.
 పశ్చిమ గోదావరిజిల్లా మొగల్తూరు మండలంలో ఎమ్మార్వోగా ఉండగా 23 రిట్ పిటీషన్‌లకు పేరావారీ జవాబులు తెలుగులోనే రాసిపంపాను. కలెక్టరేట్ నుండి ఫోన్. తెలుగులో ఎందుకు పంపారనే ప్రశ్న. తెలుగులోనైతే జవాబులు తప్పుల్లేకుండా సూటిగా, స్పష్టంగా ఇవ్వగలననీ, అర్థంకాక పోవడమనే సమస్యే రాదనీ, వాటిని యధాతథంగా హైకోర్టుకు సమర్పించమనీ, కాదు కూడదంటే ఇంగ్లీషులోకి తర్జుమా చేయించి జిల్లా కేంద్రం నుండే హైదరాబాద్‌కు పంపించండనీ వేడుకున్నాను. పై జీవోలూ,అధికార భాషా చట్టం పుణ్యాన వారు వాటిని హైకోర్టులో నివేదించారు. యధాతథంగానో, ఆంగ్లంలోకి మార్పించో నాకు తెలియదు గానీ అన్ని కేసులూ గెలిచాం. ఆలోచన మన అమ్మ భాషలోనే పుడుతుంది. అమ్మ భాషలో వాదిస్తే గెలుపు ఖాయం అనే సంగతిఅర్థమయ్యింది.
2.అన్నిదరఖాస్తులు,తెలుగులోఉండాలి 
పాలకొల్లు మండలంలో ఎమ్మార్వోగా ఉండగా దరఖాస్తు ఫారాలు నింపడానికి ఆఫీసు బయట ఒక ప్రైవేటువ్యక్తి పనిచేస్తూ ఉండేవాడు. వచ్చిన వ్యక్తుల అవసరాలనుబట్టి ఇంతింత ఈ ఫారం నింపడానికివ్వాలని వసూళ్ళు చేస్తున్నాడని ఫిర్యాదులు వచ్చాయి. ఆ ఫారాలు ఇంగ్లీషులో ఉండేవి. ఏయే పనులకోసం ఈ ఆఫీసుకు ప్రజలు వస్తున్నారు, ఏమేమి ఫారాలు వాళ్ళు పూరించి ఆఫీసులో ఇవ్వాలో తెలుసుకున్నాను. ఓపికగా ఆయా దరఖాస్తులు తెలుగులోకి అనువదించాను. నాలుగైదు తరగతులు చదివిన వారెవరైనా పూర్తిచేయటానికి వీలుగా అన్నిరకాల దరఖాస్తుఫారాలు తయారయ్యాయి. వాటిని ఆ ఊళ్ళోని జిరాక్సు షాపులన్నిటికీ ఇచ్చి కేవలం అర్ధరూపాయికే ఏ ఫారమైనా అమ్మాలని చెప్పాము. ఎవరికివారే ఫారాలు నింపుకొని వస్తున్నారు. ప్రతిఫారమూ నాలుగైదు దశలు దాటివచ్చే పద్ధతి తీసేశాం. గ్రామ పాలనాధికారి, రెవిన్యూ ఇన్స్‌పెక్టర్ సంతకాలు చేస్తే చాలు. వాటిపైన నేను సంతకం చేసేవాడిని. ఆఫీస్‌లో గుమాస్తాల ప్రమేయం తగ్గింది. పత్రాల జారీవేగంపెరిగింది.

3.ధృవీకరణపత్రాలు,తెలుగులోనేఇవ్వాలి   
నేను హై స్కూల్ చదువుకు రోజూ 7 కి.మీ. కంకటపాలెం నుండి బాపట్ల నడిచి వచ్చే వాడిని. కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం తహసీల్ దార్ ఆఫీస్‌కు వారం రోజులపాటు తిరిగేవాడిని. ప్రతిరోజూ డఫేదారు దగ్గర ఒకటే సమాధానం- దొరగారు క్యాంపు కెళ్ళారు, రేపురండి. ఆనాడు అనుకున్నాను నేను గనక తాసీల్దారునైతే చిన్నపిల్లలకు చకచకా సంతకాలు చేసి పంపిస్తాను. తహసీల్దారునయ్యాక మాట నిలుపుకున్నాను.
స్కూళ్ళు తెరిచే జూన్ మాసంలో సర్టిఫికెట్ల కోసం పిల్లలు బారులు తీరేవాళ్ళు. రద్దీ ఎక్కువగా ఉన్నపుడు ఆ పిల్లల చేతనే సర్టిఫికెట్లపై నంబర్లు వేయించి స్టాంపు, సీలు కొట్టుకోమనేవాడిని. అరగంటలో పిల్లలంతా సర్టిఫికెట్లతో వెళ్ళిపోయేవారు. అంతా తెలుగులోనే. తెలుగు పిల్లలు తెలుగులో ఎంతో వేగంగా పనిచేసేవాళ్ళు. నా 13 సంవత్సరాల ఎమ్మార్వో పదవీ కాలంలో తెలుగు పిల్లలు ఎక్కడా పొరపాటు చేయలేదు. రిజిస్టర్లన్నీ చక్కటి తెలుగులో మన తెలుగు పిల్లలే నిర్వహించారు. మండలంలోని అన్ని హైస్కూళ్ళ ప్రధానోపాధ్యాయులకూ ఒక ప్రొఫార్మా ఇచ్చి, వారి స్కూల్లోని పిల్లలందరి కులం, స్వస్థలం, పుట్టిన తేదీ- మొదలెన వివరాలు నింపి ధ్రువీకరించి పంపమని కోరాను. ఆయా గ్రామ పాలనాధికారులు కూడా ఆ వివరాలను ధ్రువీకరించారు. పిల్లలెవరూ మండల కార్యాలయానికి రానక్కరలేకుండా ।శాశ్వత కుల, నివాస స్థల, పుట్టిన తేదీ ధ్రువపత్రాన్ని' వారి ఫొటోలు అంటించి, వారి వారి పాఠశాలల్లోనే పంపిణీ చేశాం. పట్టాదారు పాసు పుస్తకాలు రైతుల ఇళ్లకు పంపిణీ చేయించాం. వీటన్నిటిని తెలుగు రాతపనిలో, మంచి చేతిరాతకలిగిన గ్రామసేవకులు, ఉపాధ్యాయులు, గ్రామ పాలనాధికారులు, విద్యార్థుల్ని కూడా ఉపయోగించుకున్నాం. ఎలాంటి తప్పులూ దొర్లలేదు. ఏ ఊరి ప్రజల పని ఆ ఊళ్లోనే ఆ ఊరివాళ్లే చేసుకున్నందువలన ఎంతో స్పష్టంగా పనిజరిగింది.ఇప్పుడు ‘విద్యార్ధుల సేవలో’ రెవిన్యూ అనే మంచి కార్యక్రమం జరుగుతోంది.
4.తెలుగు అనువాదాలు ఇంకా బాగుపడాలి    
2008 లో పులిచింతల ప్రాజెక్ట్ లో భూసేకరణ సమ్మతి అవార్డు తెలుగులో ఇచ్చాను.అంతకు ముందు ఎలాంటి మాదిరీ లేని పరిస్థితుల్లో కొత్తగా అనువాదానికి స్వయంగా పూనుకొని రాసిన ఆ అవార్డు రాష్ట్రంలో మొదటి తెలుగు అవార్డు అయ్యింది. --- అధికారులారా! ఇలా మీరెందుకు రాయలేరు?! (జనవరి, 2009, పాలనాభాష (సమాచారనేత్రం). కాబట్టి ఎవరో ఒకరు పూనుకొని కొత్త పత్రాలను తయారు చేయాలి.అవే కాలక్రమేణా మెరుగు పడుతూ వాడుక భాషలోకి మారుతూ అందరికీ మార్గదర్శకమౌతాయి.
ప్రస్తుతం ఇంగ్లీషు నుండి తెలుగులోకి ,తెలుగు నుండి ఇంగ్లీషు లోకి కంప్యూటర్ పై జరిగే అనువాదాలు సవాలక్ష లోపాలతో ఉన్నాయి.తెలుగువారు సాంకేతికంగా ఎంత ఎదిగినా నేటివరకూ అనువాద యంత్రాల తయారీలో బాగా వెనుకబడే ఉన్నారు.కారణం తెలుగు చదువు నాశనమై పోవడమే.కాబట్టి అనువాదాలను తప్పుల్లేకుండా చేసి ఇచ్చే సాఫ్ట్ వేర్ల తయారీదార్లపై తెలుగు ప్రజలు,నాయకులు దృష్టి సారించాలి. మంచి తమిళంలో ఉత్తమ సాఫ్ట్ వేర్‌ను ఎంపిక చేసి, దాని రూపకర్తకు కన్యన్‌పూంగుండ్రనాథ్ పేరుతో రూ.1 లక్ష నగదు అవార్డు, ప్రశంసపత్రం ప్రతి సంవత్సరం పంపిణీ చేస్తున్నారు. తెలుగులో కూడా  ఉత్తమ సాఫ్ట్ వేర్ లు తయారుచేసిన సాంకేతిక నిపుణులకు,తెలుగు భాషకు ఉపకరించే సులభ ఉపకరణాలను తయారు చేసిన సాంకేతిక పరిజ్నానులకు తెలుగు వైతాళికుల పేరు మీద ప్రోత్సాహక బహుమతులు ఇవ్వాలి.మనకు కూడా కొలిచాల సురేశ ,వెన్ననాగార్జున లాంటి కంప్యూటర్ తెలుగు లిపి సాంకేతికులు చాలామంది ఉన్నారు.  తెలుగులోకి తర్జుమాలో తప్పులు రాకుండా మెరుగు పరిచే వారికి ఆర్ధిక సహాయం చెయ్యాలి.అనువాద ఉపకరణాలు  లెక్కకు మిక్కిలిగా రావాలి. ఆన్‌లైన్‌లోనూ ఆఫ్‌లైన్‌లోనూ వాటిని విరివిగా లెక్సికన్లు వాడుకునే సౌలభ్యాలు కలగాలి.యంత్రానువాదాలకూ, లిప్యంతరీకరణకూ, విషయాలకు ఆకారాది సూచికలను తయారు చేయటానికీ, వెతకటానికి అనుకూలంగా తెలుగులో కంప్యూటర్‌ వాడకం పెరగాలి.తెలుగు నుండి ఇంగ్లీషు తదితర భాషల్లోకి అలాగే ఇంగ్లీషు నుండి తెలుగులోకి తర్జుమా చేసే ఉపకరణాలు ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందలేదు.అనువాదంలో చోటుచేసుకుంటున్న లోపాలను తప్పుల్నీ సరిదిద్దటానికి తెలుగు సాంకేతిక నిపుణులు అందరూ పూనుకోవాలి.ఈ అనువాద సామాగ్రి ఎంత నాణ్యంగా అభివృద్ధి చెందితే తెలుగులో పాలన అంత నాణ్యత గా ఉంటుంది.ఫైళ్ళ కదలికలో వేగం పెరుగుతుంది. ఏ ఏటికాయేడు విడుదలైన అనువాద ఉపకరణాలలో నాణ్యమైన వాటికి బహుమతులివ్వాలి.

5. నిఘంటువులలో వాడుక భాష పదసంపద పెరగాలి - వాడుకభాష లోకి చట్టాలు మారాలి 
మన రాష్ట్రంలో తెలుగు మొదటి అధికార భాష కాగా ఉర్దూ రెండవ అధికార భాష. ఈ రెండు భాషల ప్రజల మధ్య వారివారి భాషా పదాల పరిచయం, అవ గాహన, మరింత పెరగటానికి నిఘంటువులు ఎంతగానో తోడ్పడతాయి.ఉర్దూ-తెలుగు నిఘంటువు, ఉర్దూ-తెలుగు జాతీయాలు, తెలుగు-ఉర్దూ సామెతలు లాంటి పుస్తకాలు ఎక్కడా అమ్మకానికి దొరకడంలేదు. ముద్రించాల్సిన అవసరంఉంది. ముషాయిరాల కంటే ముఖ్యమైన తెలుగు-ఉర్దూ, ఉర్దూ తెలుగు నిఘంటువులు కావాలి. వక్ఫ్‌బోర్డు నిఖా నామాలు (వివాహ ధ్రువపత్రాలు) తెలుగు భాషలో కూడా ప్రచురించాలి. తెలుగు జాతీయలూ, నుడికారాలూ, పదబంధాలూకూర్చిన నిఘంటువుల అవసరంఉంది.ఆన్‌లెన్‌లోనే నిఘంటువులకు కొత్త పదాలను జోడించే అవకాశం అందరికీ ఇవ్వాలి. ఏయే ప్రాంతాల్లో ఏ పదాన్ని ఎందుకు, ఎలా వాడుతుంటారో ఆయా ప్రాంతాల ప్రజలనే చెప్పనివ్వాలి. సరిగాఉన్నట్లు భావించిన కొత్త పదాలను ఎప్పటికప్పుడు నిఘంటువుల్లో చేరుస్తూ పోవాలి. మన నిఘంటువుల సైజు పెరగాలి. అవి జన బాహుళ్యానికి వాడకంలోకి విస్తారంగా వస్తూనే ఉండాలి. వాడుక భాషలో నానా భాషలూ కలగాపులగంగా ఉంటాయి.అయితే అవన్నీ ప్రజలకు బాగా అర్ధమౌతాయి.పరభాషా పదాలనే కారణంతో ఇప్పుడు తెలుగు వాడకంలోంచి సంస్క­తం, ఇంగ్లీషు, ఉర్దూ పదాలను తీసివేయకూడదు,తీసివేయలేము.ఎందుకంటే  అవి మనభాషలో అంతర్భాగాలై పోయాయి. అక్కరలేని ఆపరేషన్ ఎవరు చేయించుకుంటారు? చేసినా గాయాలవడం తప్ప మరే మేలూ కలుగదు. అందువలన ఈ సంకర తెలుగు భాషలోనే ఆఫీసుల్లో ఫైళ్ళు నడిపితే అదే పదివేలుగా భావించాలి. ఛాందసవాదులు- వాళ్ళు చెయ్యరు, ఇంకొకళ్ళను చేయనివ్వరు. ఒకవేళ ఈ పనిని వాళ్ళకప్పజెబితే ఎవరికీ అర్థంగాకుండా పాడుచేస్తారు. ప్రజలు ఇంతకంటే ఇంగ్లీషే నయమని వాపోయేలా చేస్తారు. మన శాసన సభలో ఎమ్మెల్యేలు ఈ మూడు భాషల పదాలు కలగలిపి మనోరంజకంగా మాట్లాడుతున్నారు. అదే నేటి తెలుగు, వాడుక తెలుగు. వారు అడిగింది అడిగినట్లు తెలుగు లిపితో సాగదనుకుంటే ఆంగ్లలిపినే వాడుకోండి. మన మాటముఖ్యం. వాళ్ళు ప్రజాప్రతినిధులు. వాళ్ళు మాట్లాడుతున్నది మన ప్రజల భాష. ఆ భాషలో, యాసలో జీవోలురావాలి.అప్పుడేతెలుగుఅధికారభాషగావిరాజిల్లుతుంది.

మాతృభాష అంటే పసిపిల్ల వాడికి తల్లి ఉగ్గుపాలతో పాటు రంగరించి పోసే భాష. మవ్మిూ,డాడీ,ఆంటీ,అంకుల్‌,బ్యాగు,బుక్కు,స్లేట్‌పెన్సిల్‌ లాంటి మాటలు తెలుగు తల్లులు తమ పిల్లలకు రంగరించి పోస్తున్నారు. బయట స్కూలు, ఆఫీసు, మార్కెట్టు, కోర్టుల్లో ఎన్నెన్నో ఆంగ్ల పదాలు ఎడతెరిపి లేకుండా వాడుతున్నారు. మాటకు వాడుకే గదా ప్రాణం? వాడకం అంతా ఆంగ్లపదాల్లో జరుగుతూఉంటే తెలుగు గ్రంథానికి పరిమితమై పోయింది. కవులు, సాహితీవేత్తలు మాత్రమే భాష గురించి బాధ పడుతున్నారు. పాలక భాషకు ఉండవలసినంత పదసంపద ఎన్నేళ్లు గడిచినా సమకూర్చలేక పోతున్నారు. అనువాదకులు తేటతెలుగుకు బదులు సంస్కృతం వాడి భయపెడుతున్నారు. కాలగమనంలో కొత్త కొత్త ఆంగ్లపదాలే మనకు అబ్బు తున్నాయిగానీ, కొత్త తెలుగు పదాలుగానీ, పాతవేగాని కొత్తగా వాడకంలోకి రావడంలేదు.
వేలాది ఆంగ్ల పదాలు మన తెలుగు ప్రజల నాలుకలపై నాట్యమాడుతూ, మన పదాలే అన్నంతగా స్థిరపడిపోయాయి. ఈ పదాలను విడిచిపెట్టి మనం తెలుగులో సంభాషణ చేయలేము. చేసినా ప్రజలకు అర్ధంగాదు. ఉర్ధూ, సంస్కృత,ఆంగ్ల పదాలెన్నింటినో తెలుగు తనలో కలుపుకుంది. అలాగే తెలుగు ప్రజల వాడుకలో బాగా బలపడిన, ఇక ఎవరూ పెకలించలేనంతగా పాతుకుపోయిన, ఇంగ్లీషు పదాలను మన తెలుగు డిక్షనరీలో చేర్చటం వల్ల మన భాష తప్పక బలపడుతుంది.వాడుక పదాల సంపద భాషకు జీవమిస్తుంది. అవి పరభాషపదాలు కూడా కావచ్చు. మనం తెలుగును సరిగా నేర్చుకోక ముందే మనకు ఇంగ్లీషు నేర్పారు. వందలాది ఏళ్ళు మనం ఇంగ్లీషును గత్యంతరం లేక హద్దు విూరి వాడినందు వల్ల, అది మన భాషాపదాలను కబళించి తానే తెలుగై మనలో కూర్చుంది. మన ఆత్మలను వశం చేసుకుంది. ఇక ఇప్పుడు ఈ ఇంగ్లీషు పదాలను నిర్మూలించడం మన తరం కాదు. వాటిని మన పదాలుగా అంగీకరించడమే మంచిది. ఏఏటికాయేడు మన నిఘంటువుకి పదసంపద సమకూర్చాలి . ఎన్ని ఎక్కువ తెలుగు నిఘంటువులు నెట్‌లో చేరితే తెలుగు అంతగా బలపడుతుంది.ఆధునిక అవసరాలకు ధీటుగా తెలుగు భాష తయారు కావాలి. ఇంగ్లీషులో ఉన్న సౌలభ్యాలన్నీ తెలుగుకూ కల్పించాలి.

6.అక్షర రూపాలు పెరగాలి – లిపిసమస్యలు తగ్గాలి
ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా శ్రీకృష్ణదేవరాయ, పెద్దన, తిమ్మన, తెనాలిరామకృష్ణ, సూరన్న, రామరాజ, మల్లన్న, ధూర్జటి, రామభద్ర, గిడుగు, గురజాడ, సురవరం, యన్.టి.ఆర్., మండలి, నాట్స్, పొన్నాల, రవిప్రకాష్, లక్కిరెడ్డి అనే18 అక్షరరూపాలను విడుదలచేశారు. కానీ ఇప్పటికే అనూ, సూరి లాంటి యూనీ కోడేతర ఫాంట్లలో ముద్రితమై ఉన్న విస్తారమైన తెలుగు సాహిత్యాన్ని తెలుగు యూనీకోడు లోకి మార్చే మార్పిడి సాధనాలు కావాలి. తర్జుమాలో తప్పులు వస్తున్నాయి. అనువాద ఉపకరణాలు, నిఘంటువులు, లెక్కకు మిక్కిలిగా రావాలి. ఆన్‌లైన్‌లోనూ ఆఫ్‌లైన్‌లోనూ వాటిని విరివిగా లెక్సికన్లు వాడుకునే సౌలభ్యాలు కలగాలి. వాటిని తయారు చేసే సాంకేతిక నిపుణులకు నిధులు ఇవ్వాలి. ప్రతి యేటా తెలుగు వైతాళికుల పేరు మీద ప్రోత్సాహక బహుమతులు ఇవ్వాలి. ఎన్ని ఎక్కువ తెలుగు నిఘంటువులు నెట్‌లో చేరితే తెలుగు అంతగా బలపడుతుంది. కాగితం, కలం రోజులు పోయాయి. ఆధునిక అవసరాలకు ధీటుగా తెలుగుభాష తయారు కావాలి. ఇంగ్లీషు లో ఉన్న సౌలభ్యాలన్నీ తెలుగుకూ కల్పించాలి. పదాల శుద్ధి యంత్రం, గుణింత, వ్యాకరణ పరిష్కారయంత్రం, సాంకేతిక నిఘంటువులు, మాండలిక నిఘంటువులు, డిజిటల్ నిఘంటు వులు, అమరకోశాలు, పదశోధనా యంత్రాలు, ఉచ్ఛారణ 'పద ప్రయోగ నిఘంటువులు, లిపిబోధినిలు, సాహిత్య శోధనా పరికరాలు, పదాను క్రమణికలు- ఇలా ఎన్నో రావాల్సిన అవసరం ఉంది. కంప్యూటర్ చదువులుకూడా రావాలి. అలా చదివిన డిగ్రీ విద్యార్థులకు పోటీపరీక్షల్లో ప్రోత్సాహకాలు ప్రకటిస్తే తెలుగు చాలాకాలం బ్రతుకుతుంది. యంత్రానువాదాలకూ, లిప్యంతరీకరణకూ, విషయాలకు ఆకారాది సూచికలను తయారు చేయటానికీ, వెతకటానికి అనుకూలంగా తెలుగులో కంప్యూటర్ వాడకం పెరగాలి.
7. లిపి సంస్కరణ జరగాలి లేదా రోమన్ లిపిలో కార్యాలయ వ్యవహారాలు నడపాలి :
 ముత్యాలలాంటి తెలుగక్షరాలంటూ లిపిమీద లేనిపోని సెంటిమెంట్లు పెట్టుకోవడం మాని రోమన్ లిపిలో(a,aa,i,ee ఈ విధంగా) తెలుగును నేర్పితే అప్పుడు మన దేశం ఆధునిక యుగం లోనికి ప్రవేశిస్తుందని తన నిశ్ఛితాభిప్రాయమని  1976 లోనే మొదటి ప్రపంచ తెలుగు మహా సభల సందర్భంగా అన్నారు మహాకవి శ్రీ శ్రీ .( ప్రజాతంత్ర (18.4.1976) "అనంతం" పేజీ196).
వత్తులు ,గుణింతాల ఇబ్బందిని అధిగమించలేకనే చాలామంది బాగా తెలుగు వచ్చిన వాళ్ళు కూడా తెలుగు  టైపింగ్ జోలికి రాలేకపోతున్నారు.లిపి సంస్కరణ కూడా అవసరమే. వత్తులూ గుణింతాల బెడద  లేకుండా ఒకే వరసలో సాగిపోయేలా రోమన్ లిపిని యంత్రానికి తగ్గరీతిలో ఆంగ్లేయులు ఎంతగానో అభివృద్ధి పరిచారు,అరబిక్ అంకెలను,భారతదేశపు సున్నాను అరువు తెచ్చుకొని మరీ ఆంగ్ల లిపిని విశ్వవ్యాప్తం చేశారు.ఆంగ్ల భాషనూ, అంకెల్ని మనం ఎలాగూ వాడుతూనే ఉన్నాం. ఇక అక్షరాలను కూడా వాడుకుంటే అధికార భాషగా రోమన్‌ తెలుగును పిల్లలకు నేర్పటం, ఫైళ్ళలో అమలు చేయటం ద్వారా ఎంతో సుళువవుతుంది. లిపిసమస్య సాకుతో అధికారభాష అమలును ప్రక్కన పెట్టటం కంటే అంతర్జాతీయంగా అమలవుతున్న లిపినే మన భాషకు వాడుకుంటే మేలు జరుగుతుంది.చరిత్రలో తెలుగు లిపి ఎన్నో సార్లు మారింది.దేశమంతటికీ ఉమ్మడి లిపిగా ఆంగ్లాక్షరాలను ఉపయోగించుకోవాలి.ప్రపంచం మొత్తం చదవగలిగే స్థాయికి ఎదిగిన ఆంగ్ల లిపిని వాడుకోవటం ద్వారా మన దేశ భాషలన్నింటికీ జవసత్వాలు సమకూరుతాయి.పైగా అన్నిభాషల వాళ్ళూ  సెల్ ఫోనుల్లో ఆంగ్ల లిపి ద్వారానే మెసేజీలు ఇప్పటికే పంపుకుంటున్నారు.ప్రపంచ దేశాలలో ఆంగ్ల లిపిలోని సంస్కృత శ్లోకాలను చదువు కుంటున్నారు.దేశ వాసులందరినీ రోమన్ లిపి ద్వారా  త్వరగా అక్షరాస్యుల్ని చేయవచ్చు.దేశ మంతటా ఒకే లిపి ఉండటం వలన అందరూ అన్ని భాషలనూ అర్ధం చేసుకోలేకపోయినా కనీసం అన్ని భాషలనూ చదవగలుగుతారు,కార్యాలయాలనుండి వచ్చే ఉత్తర్వులను చదవటం చదివించుకొనటం సులువౌతుంది.లిపి ద్వారా ఐక్యత వస్తుంది.అందువలన తెలుగులో పాలన వ్యవహారాలు సులువుగా జరగాలంటే  వేటూరి ప్రభాకర శాస్త్రి గారు ఆనాడు కోరినట్లు లిపి సంస్కరణన్నా జరగాలి లేదా శ్రీ శ్రీ  గారి సలహా మేరకు రోమన్ లిపిలో అయినా కార్యాలయ వ్యవహారాలు నడపాలి.

8. తెలుగు మాధ్యమంలో చదువులు పెరగాలి  :
ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో కూడా అన్ని స్థాయిల్లో పదో తరగతి వరకు తెలుగు మీడియం ఉండాలి. రాజ్యాంగంతో సహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చట్టాలను వాడుక భాషలోకి తేవాలి. ఎనిమిదో షెడ్యూల్‌లో పేర్కొన్న భాషలన్నిటినీ అప్పటికప్పుడు తర్జుమాచేసే విధంగా పార్లమెంటులో ఏర్పాటుచేయాలి. న్యాయస్థానంలో తీర్పులు అధికార భాషలో ఉండేలా చర్యలు తీసుకోవాలి. అధికార భాషను అమలు చెయ్యని అధికారులపై చర్యలు తీసుకునే అధికారం అధికార భాషా సంఘానికి ఇవ్వాలి. తెలుగు భాషా రక్షణ అభివృద్ధికి మంత్రిత్వ శాఖ కూడా ఏర్పాటు చేశారు.సాహిత్య అకాడమీలు కూడా రాబోతున్నాయి. తెలుగులో ఉత్తరప్రత్యుత్తరాలు రాయగల ఐ.ఎ.యస్., ఐ.పి.యస్. అధికారుల్ని మాత్రమే ప్రజలతో సంబంధమున్న కీలక స్థానాల్లో నియమించాలి. తెలుగు విశ్వవిద్యాలయం, అధికార భాషాసంఘం, తెలుగు అకాడమీ, అన్ని విశ్వవిద్యాలయాల్లోని తెలుగు విభాగాలు కలసికట్టుగా కృషిచేసి ఏయేటికాయేడు అవి తెలుగు భాషాభివృద్ధి కోసం ఏంచేశాయో, ఏం సాధించాయో ప్రగతి నివేదికలను బయటపెట్టాలి. ఈ సంస్థలన్నీ ప్రజల నుండి సూచనలు తీసుకోవాలి. పరిపాలక గ్రంథాలు అంటే కోడ్లు, మాన్యువల్‌లు లాంటివన్నీ తెలుగులో ప్రచురించి అన్నికార్యాలయాలకు పంపాలి. సర్వీస్‌కమిషన్ పోటీపరీక్షలు, శాఖాపరమైన పరీక్షలు తెలుగులో నిర్వహించాలి. కూడిక, తీసివేత లాంటి తెలుగు పదాలకు బదులు సంకలనం, వ్యవకలనం లాంటి సంస్కృత పదాలను వాడి తెలుగు మీడియం అంటే పిల్లలు భయపడేలా చేశారు. పిల్లల పుస్తకాలు వాడుక తెలుగుతో చెయ్యాలి. కేవలం తెలుగు మీడియంలో మాత్రమే చదివిన వారికి ఇంగ్లీషు రాకపోయినా ఎటువంటి శాస్త్ర సాంకేతిక రంగంలో నయినా ఉద్యోగం వస్తుందనే వాతావరణం కల్పించాలి.
9. ఉద్యోగాలు , ప్రోత్సాహకాలిచ్చి  భాషను కాపాడాలి  
ఎవరి భాషను వాళ్ళు కాపాడుకోవాలి- అధికారభాషగా అభివృద్ధి చేసుకోవాలి  (రాజ్యాంగం 345 ఆర్టికిల్).
కోయంబత్తూరులో జరిగిన ప్రపంచ తమిళ మహాసభల్లో తమిళ మాధ్యమ విద్యార్ధులకు ప్రభుత్వ ఉద్యోగాలు సులభంగా లభించేలా కొన్ని తీర్మానాలు చేశారు. తమిళ మీడియం అభ్యర్దులకు ఉద్యోగాలు దొరకక పొతే ప్రజలు పిల్లల్ని తమిళ మాధ్యమం లో చదివించరనీ ,ఎవరూ చదవని భాష నశిస్తుందనీ ,తమిళం పదికాలాలపాటు బ్రతకాలంటే ఆభాషలో మాత్రమే చదివిన వారికి వెనుక బడిన కులాలవారికి ఇస్తున్నట్లుగా ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని తీర్మానం చేశారు.అందుకోసం అత్యవసరంగా ఒక ఆర్డినెన్స్ తెచ్చారు.శాసన సభలో,స్థానిక సంస్థల్లో ,ప్రభుత్వ కార్పోరేషన్లు,కంపెనీలలో తమిళ అభ్యర్దులకు 20 శాతం ఉద్యోగాలుఇవ్వాలనిశాసించారు.
తమిళనాడు ప్రభుత్వం జీవో ఎం ఎస్ నంబర్ 145 P & AR (S) డిపార్ట్ మెంట్ తేదీ. 30.09.2010 ద్వారా తమిళ మీడియం లో డిగ్రీ వరకు చదివిన అభ్యర్దులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో 20 శాతం రిజర్వేషన్ ఇస్తున్నారు.చెన్నై హైకోర్టు కూడా 23.2.2016 న ఈ చట్టాన్ని సమర్ధించింది.ప్రమోషన్లలో కాకుండా ప్రభుత్వోద్యాగాలకు మొదటిసారిగా నేరుగా జరిపే నియామకాలకు తమిళ మాధ్యమంలో చదివిన అభ్యర్దులకు 20% ఉద్యోగాలు రిజర్వు చేయడంలో ఎలాంటి తప్పూ లేదని తేల్చేసింది.రాజ్యాంగంలోని 345 ఆర్టికిల్ ప్రకారం ఎవరి భాషను వాళ్ళు కాపాడుకోవాలని,ఆయా రాష్ట్రాలలో పాలనాభాషగా అధికారభాషగా అభివృద్ధి చేసుకోవాలని కూడా తెలియ జేసింది. కాబట్టి తమిళనాడును ఆదర్శంగా తీసుకొని  ఒకటవ తరగతి నుండి డిగ్రీ వరకు తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థులకు పోటీ పరీక్షల్లో ప్రోత్సాహకాలు ఇవ్వాలి.తమిళనాడులో లాగా ఉద్యోగాలలో 20% రిజర్వేషన్ ఇవ్వాలి.  గ్రూప్‌ 1, గ్రూప్‌ 2,3 లాంటి  సర్వీసు ఉద్యోగాలలోతెలుగు మీడియంలో చదివిన వారికి గతంలో ఇచ్చిన మాదిరే 5% ప్రోత్సాహక మార్కులు ఇవ్వాలి.పబ్లిక్ సర్వీస్ కమీషన్లు తెలుగు మాధ్యమ అభ్యర్దులను ఆదరించాలి.
తెలుగు మీడియం అభ్యర్ధులకు 10 శాతం ఉద్యోగాలు కోటా ఇస్తామని అప్పటి సాంస్కృతిక శాఖ మంత్రి పల్లె రఘునాధరెడ్డి గారు ప్రకటించారు. ఇంటర్ వరకు కూడా తెలుగు మీడియాన్ని తప్పనిసరి చేస్తామన్నారు.(ఆంధ్రజ్యోతి 9.12.2016).ఈ ప్రకటనలు జీవో లుగా రావాలి. ఉద్యోగ నియామకాలు పూర్తయ్యే లోపు ఈ ప్రతిపాదనలను పబ్లిక్ సర్వీసు కమీషన్లు ప్రభుత్వానికి పంపి ఆమోదం పొందాలి.
అంధ్రప్రదేశ్,తెలంగాణా రాష్ట్రాల సర్వీస్ కమీషన్లు రెండూ భారీ ఎత్తున గ్రూప్‌-2,3 సర్వీసు ఉద్యోగాల భర్తీ చేస్తు న్నాయి. వీటిలో మున్సిపల్‌ కమిషనర్,ఏసీటీఓ,సబ్‌ రిజిస్ట్రార్,డిప్యూటీ తహసిల్దార్‌,అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌,అసిస్టెంట్‌ డెవల్‌పమెంట్‌ ఆఫీసర్‌,ఎక్స్టేన్షన్‌ ఆఫీసర్‌,ఎక్సైజ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌,అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌,సీనియర్‌ ఆడిటర్‌,సీనియర్‌ అకౌంటెంట్‌,జూనియర్‌ అకౌంటెంట్‌,జూనియర్‌ అసిస్టెంట్‌,గ్రామపంచాయతీ సెక్రెటరీ లాంటి ఉద్యోగాలున్నాయి.ఇవన్నీ తెలుగులో చేసే ఉద్యోగాలే . ఐ ఏ ఎస్ ,ఐ పి ఎస్ లాంటి ఉన్నతోద్యోగాలు కావు.తెలుగు ప్రజలతో మమేకమై వారితో ముఖాముఖి తెలుగులో మాట్లాడుతూ వారిమధ్యే నివసిస్తూ వారికి సేవలందించే ఉద్యోగాలు.తెలుగు ప్రజల సమస్యలను సరిగ్గా విశ్లేషణ చేయాలి. గ్రామ సామాజిక , ఆర్థిక వ్యవస్థ పై తగిన అవగాహన తెచ్చుకోవాలి.ప్రజా పరిపాలన పరిజ్ఞానం పెంచుకోవాలి. అక్కడి ప్రజలు వారి భాషలో చెప్పే సమస్యలు, పరిష్కారాలు,సూచనలు వినాలి,రాయగలగాలి . ఈ నైపుణ్యాలన్నీ ప్రజల భాష లో తెలుగు మాధ్యమంలో చదివిన వారికే ఎక్కువగా ఉంటాయి.గ్రూప్ 1, గ్రూప్ 2 సర్వీసు ఉద్యోగాలలో డిగ్రీ తెలుగు మీడియంలో చదివిన వారికి గతంలో ఇచ్చిన మాదిరే 5 శాతం ప్రోత్సాహక మార్కులు ఇవ్వాలి.తమిళనాడు తరహాలో  తెలుగు మాధ్యమ అభ్యర్ధులకు 20 శాతం ఉద్యోగాలు కూడా రిజర్వేషన్ ఇస్తే,అప్పుడు తెలుగులో కార్యాలయ వ్యవహారాలు నడిపే వాళ్ళు రంగప్రవేశం చేస్తారు. కొంతవరకైనా ఆఫీసుల్లో తెలుగు బ్రతుకుతుంది. తెలుగు విూడియంలో చదివితే ఉద్యోగా లొస్తాయన్న ఆశతో కొంత మందైనా తెలుగులో చదువుతారు. తెలుగులో చదివిన అధికారులు కార్యాలయాల్లో జరిగే పనులన్నిటికీ ''కొత్తపదాలు'' పుట్టిస్తారు. తెలుగు పదకోశాలు అమలవుతాయి. పరిపాలనకు పనికొచ్చే శాస్త్రీయ పాలనా తెలుగు తయారవుతుంది.అధికారభాషగా తెలుగు అమలు కావాలంటే తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థుల్ని ప్రోత్సహించి అధికారులుగా చేయకతప్పదు.

10.తెలుగు అమలుకై అధికారభాషా సంఘం, తెలుగు అకాడమీలు,తెలుగు విశ్వవిద్యాలయాలకు అదనపు బాధ్యతలు అధికారాలు ఇవ్వాలి       
 వ్యాపార సంస్థలు,దుకాణాలన్నీ తెలుగులో బోర్డులు ఏర్పాటు చేయకపోతే వాటి లైసెన్సులు రద్దు చేసే అధికారం కన్నడ అధికార భాషా సంఘానికి ఉన్నట్లుగా, తెలుగు అధికార భాషా సంఘానికి కూడా ఉండాలి. మండల స్థాయి నుండి సచివాలయం వరకు అధికార భాషను అమలు చెయ్యని అధికారులపై చర్యలు తీసుకునే అధికారం అధికార భాషా సంఘానికి ఇవ్వాలి. తెలుగు విశ్వవిద్యాలయం, అధికార భాషా సంఘం, తెలుగు అకాడవిూ, అన్ని విశ్వవిద్యాలయాల్లోని తెలుగు విభాగాలు కలసికట్టుగా కృషిచేసి ఏయేటికాయేడు అవి తెలుగు భాషాభివృద్ధి కోసం ఏంచేశాయో, ఏం సాధించాయో ప్రగతి నివేదికలను తెలుగు ప్రజలకు బయటపెట్టాలి. ఈ సంస్థలన్నీ ప్రజల నుండి సూచనలు తీసుకోవాలి. పరిపాలక గ్రంథాలు కోడ్లు, మాన్యువల్‌లు, లాంటివన్నీ తెలుగులో ప్రచురించి అన్ని కార్యాలయాలకు పంపాలి. సర్వీస్‌కవిూషన్‌ పోటీ పరీక్షలు,శాఖాపరమైనపరీక్షలు తెలుగులోనిర్వహించాలి.
11. మంత్రిత్వ శాఖ ,సచివాలయం, శాసనసభలు,న్యాయస్థానాలు అన్నీ కలసికట్టుగా కృషి చెయ్యాలి  
హైకోర్టులో తెలుగులో వాదనలకు అనుమతించాలి. తెలుగును రెండవ జాతీయ భాషగా ప్రకటించాలి. మన ప్రజల భాషలోనే జీవోలు రావాలి. అప్పుడే తెలుగు అధికార భాషగా విరాజిల్లుతుంది.తెలుగు భాష మాట్టాడేవాళ్ళ సంఖ్యనుబట్టి, జనబలాన్ని బట్టి పార్లమెంటులో మన గౌరవం మనకు దక్కుతుంది. హిందీతో పాటు తెలుగును కూడా ఇతర భాషలవాళ్ళు నేర్చుకోవాల్సి వస్తుంది.పార్లమెంటులో హిందీ వాళ్ళలాగా మనం కూడా తెలుగులో మాట్లాడవచ్చు. కేంద్ర ప్రభుత్వం జారీచేసే ఉత్తర్వులన్నీ తెలుగులో పొందవచ్చు. కేంద్రంతో ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ తెలుగులో నడుపవచ్చు. చట్టాలన్నీ తెలుగులోకి మార్చబడతాయి. తెలుగులో తీర్పులొస్తాయి. తెలుగులో ఇచ్చే అర్జీలు ఢిల్లీలో కూడా చెల్లుతాయి. ఇతర రాష్ల్రాల్లో ఉన్న తెలుగువారికి కొండంత అండ, గౌరవం హిందీ వాళ్ళతో పాటు సమానంగా లభిస్తాయి. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, రైల్వేస్టేషన్లలో బోర్డుల విూద తెలుగులో కూడా పేర్లు రాస్తారు. ఈ రోజున హిందీ భాష వల్ల హిందీ వాళ్ళకు ఏయే ప్రయోజనాలు ఒనగూడాయో అవన్నీ తెలుగు వాళ్ళు కూడా పొందవచ్చు.
                                                                                        నూర్ బాషా రహంతుల్లా
                                                                                      స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్
                                                                                            అమరావతి   
                                                                                                                 9948878833