10, ఫిబ్రవరి 2018, శనివారం

హైకోర్టుల్లో ప్రాంతీయ భాషలు

హైకోర్టులో తెలుగు




10.2.2018 న ఘంటసాల మండలం శ్రీకాకుళం లో జరిగిన తెలుగు భాష బ్రహ్మోత్సవానికి హాజరయ్యాను.
పాలనా భాషగా తెలుగు అనే అంశంపై మాట్లాడాను.
18 వ శతాబ్దం లో బుడ్డావెంగళరెడ్డి గారికి విక్టోరియా మహారాణి బహూకరించిన పతకం తెలుగులోనే రూపొందించగా లేనిది మనరాష్ట్రంలో మనము తెలుగు అమలు చేయలేమా అని అడిగాను.

ఇక్కడ కూర్చొని ఆముక్తమాల్యద రాసిన శ్రీకృష్ణదేవరాయలను మరోసారి గుర్తుకు తెచ్చుకున్నాము.చట్టాలను తేలికైన తెలుగులోకి అనువాదం చేస్తాను,నన్ను ఉపయోగించుకోండి అని నల్గొండ మాజీ కలక్టర్ ముక్తేశ్వరరావు గారు విజ్నప్తి చేశారు.

ఆనాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుగారు పాలనలో తెలుగు భాష అమలు కోసం  చేసిన శపధం ఇది :
"మన భాషలో మనల్ని మనం పరిపాలించుకుందాము. 

జన ఘోషకు స్పందించాల్సిన సర్కారీ యంత్రాంగం జన భాషకు పట్టం కట్టాలి.
దస్త్రం తెలుగులో రూపొందిస్తేనే సంతకం చేస్తాను". 
తెలుగు పాలకుని ఈ మాటల స్పూర్తి తో నేటి మన నాయకులు,అధికారులూ పనిచెయ్యాలని కోరాను. 

హైకోర్టుల్లో ప్రాంతీయభాషలు ఇప్పటికైనా ప్రవేశించాలని కోరాను:
హైకోర్టుల్లో స్థానిక భాషల్లో వాదనలు,తీర్పులు ఉండాలని కోరుతూ చదివిన పత్రం:
హైకోర్టులో తమిళం వినియోగంపై చేసిన విన్నపాన్ని కేంద్రం తిరస్కరించిందని,మద్రాసు హైకోర్టులో తమిళాన్ని అధికార భాషగా వినియోగించేందుకు అనుమతించాలని తమిళనాడు శాసనసభ పంపిన తీర్మానాన్ని పునఃపరిశీలించాలని ఏఐఏడీఎంకే ఎంపీ శశికళ పుష్ప కేంద్రప్రభుత్వాన్ని కోరారు.దానిపై స్పందిస్తూ స్థానిక భాషలను హైకోర్టుల్లో అధికార భాషగా ఉపయోగించడం ఆదర్శవంతంగా ఉంటుందని రాజ్యసభ ఛైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు.అయితే అందుకు విస్తృతస్థాయిలో ఏకాభిప్రాయం అవసరమని వ్యాఖ్యానించారు. (ఈనాడు 8.2.2018 )

ఏకాభిప్రాయం రాలేదు – అసలు ఇంగ్లీషు తప్ప మరేభాషా హైకోర్టుల్లో వద్దన్నారు
2008 లో హిందీ వాళ్ళు రాజ్యాంగం లోని ఆర్టీకిల్ 248ని సవరించి హైకోర్టు,సుప్రీంకోర్టుల్లో హిందీ తీర్పులు తేవాలని ప్రతిపాదించారు. లాకమీషన్ దేశవ్యాప్తంగా నిష్ణాతులైన న్యాయమూర్తుల్ని సంప్రదించి ఇంగ్లీషులో తప్ప హిందీ లో గానీ ఇంకా ఏ ఇతర భారతీయ భాషలలో గానీ వాదనలు తీర్పులు కుదరవని ఏకగ్రీవంగా తీర్మానించింది. అది చెప్పిన కారణాలు:

“భాష దేశ ప్రజల భావోద్వేగాలను ప్రభావితం చేస్తుంది. భాష ప్రజలను ఐక్యపరుస్తుంది. ఎవరిమీదా ఏ భాషనూ బలవంతంగా రుద్దకూడదు.ఉన్నతన్యాయస్థానాలలోని వాదనలు తీర్పులు మామూలుగా జరిగేది ఆంగ్ల భాష లోనే.భారతీయ న్యాయ వ్యవస్థ ఇంగ్లీషుకు అమరికా న్యాయ పుస్తకాలకు అలవాటుపడింది. కాబట్టి ఉన్నత న్యాయమూర్తుల్ని ఇంగ్లీషుకే స్వేచ్ఛగా వదిలేయ్యాలి.ఒక రాష్ట్ర హైకోర్టు జడ్జి మరో ప్రాంతానికి బదిలీపై వెళితే ఆ రాష్ట్ర భాష నేర్చుకొని ఆ భాషలో తీర్పులివ్వాల్సివస్తుంది. అది చాలా కష్టం. జడ్జీలమీద అనేక భాషల భారం మోపకూడదు. వాళ్ళమీద ఏ భాషనూ రుద్దకుండా జడ్జీలను వాళ్ళ భాషకు వాళ్ళను స్వేచ్ఛగా వదిలేయ్యాలి. దేశప్రజలందరూ తప్పక సర్వోన్నత న్యాయస్థానం తీర్పులిచ్చే ఏకైక భాష అయిన ఇంగ్లీషును అర్ధం చేసుకోక తప్పదు.అన్నీ కోర్టుల్లో ఇంగ్లీషే ఉంటే వివిధ భాషా ప్రాంతాలమధ్య న్యాయవాదుల కదలిక సులభం అవుతుంది.కోర్టుల్లో హిందీ అమలు కోసం కావాల్సిన చట్టపరమయిన నియమాలు నిబంధనలుమాత్రం ముందు ఇంగ్లీషులోనే చెయ్యాలి. దానికి అధి కారపూర్వకమైన అనువాదం చేసుకోవచ్చు.ఉన్నత న్యాయ స్థానాలను మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంగ్ల భాషను మార్చుకోమని అడగవద్దు”. అన్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు తీర్పులు ఆశించగలమా?
రాష్ట్రపతి,ఉపరాష్ట్రపతి,సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి లాంటి పెద్దలంతా కక్షిదారుల భాషలోనే హై కోర్టుల్లో కూడా వాదనలూ తీర్పులు ఉండాలని చెబుతున్నారు కదా అన్న ధైర్యంతో 2017 లో ఒక కేసులో తెలుగులో ప్రతివాదన తయారుచేసి తీసికెళితే హైకోర్టు ప్రభుత్వ న్యాయవాది దానిని తిరస్కరించారు. హైకోర్టులో తెలుగు వాదన చెల్లదు అన్నారు.తెలుగులో వాదన తెచ్చినందుకు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంగ్లీషులో వాదించలేని నేను డిప్యూటీ కలక్టర్ పదవికి తగనని ఎగతాళి చేశారు. చివరికి నాతెలుగు ప్రతివాదాన్ని ఇంగ్లీషులోకి మార్చి ఇస్తేనే తీసుకున్నారు. హైకోర్టు స్థాయికి తెలుగు భాష ఇంకా వెళ్ళలేదు.మనము మన మాతృ భాషలను వదిలి ఆంగ్లానికి దాసోహమవటానికి సగం కారణం కోర్టులు,కోర్టులిచ్చే ఆంగ్ల తీర్పులే.
ఇంగ్లీషు రాని వాళ్ళెవరూ కోర్టుల్లో పనికిరాని పరిస్తితి దాపురించింది.

దేశానికి ఆంగ్లమే దిక్కు అంటున్న న్యాయమూర్తులు కల్పించే ఇలాంటి అడ్డంకుల్ని అధిగమించి ప్రజల భాషలలో న్యాయస్థానాలు నడిచేలా చేయాలి.హైకోర్టుల్లో ప్రాంతీయ భాషలలో వాదనలు వినిపించేలా న్యాయవ్యవస్థతో సంప్రదింపులు లేకుండా కేంద్రమే ఓ నిర్ణయం తీసుకునేందుకు తగినన్ని అధికారాలను రాజ్యాంగం కల్పించిందని పార్లమెంటరీ సంఘం పేర్కొందికాబట్టి ఇప్పటికైనా కేంద్రం ప్రాంతీయ భాషలు బ్రతకడం కోసం తనకున్న రాజ్యాంగ అధికారాలు వినియోగించుకోవాలి.ప్రాంతీయ భాషలలో తీర్పులు ఇవ్వాలని చట్టం చెయ్యాలి.

అవసరమైన చట్టాలు లేకుండా భాషోత్సవాలు ఎన్ని జరుపుకున్నా ఫలితం ఉండదు.
  --నూర్ బాషా రహంతుల్లా , స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్,అమరావతి, 9948878833